హైదరాబాద్, నవంబర్ 11 : వారం రోజుల్లో పెళ్లి జరగాల్సిన ఆ ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. హైదరాబాద్ కొత్తపేట వద్ద జరిగిన ప్రమాదంలో ఖమ్మం జిల్లాకు చెందిన గీత దుర్మరణం పాలయ్యారు. వివరాలలోకి వెళితే.. ఖమ్మం జిల్లాకు చెందిన గీత (21) కు ఈ నెల 24 వ తేదీన వివాహం జరగనుంది. పెళ్ళికి వస్త్రాలను కొనేందుకు కొత్తపేటలోని ఓ వస్త్ర దుకాణానికి చేరుకున్నారు. వస్త్రాలు కొనుగోలు చేసిన అన౦తరం ద్విచక్ర వాహన౦పై వెళ్తుండగా వెనక నుండి టిప్పర్ లారీ ఢీకొంది. ఈ ఘటనలో గీత అక్కడికక్కడే మృతి చెందగా తన వెంట ఉన్న మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.