చెన్నై, నవంబర్ 11 : అక్రమాస్తుల కేసులో ఆరోపణలు ఎదుర్కొ౦టున్న శశికళ బంధువర్గంపై ఏకకాలంలో ఐటీ సిబ్బంది దాడులు నిర్వహించారు. బినామీ పేర్లతో 10 బోగస్ సంస్థలను ప్రారంభించిన శశికళ కుటుంబీకులు పెద్ద ఎత్తున మోసాలకు పాల్పడ్డారన్న సమాచారంతో 147 చోట్ల.. 1800 మంది ఐటీ సిబ్బంది కలిసి సోదాలు నిర్వహించారు. 1000 కోట్ల రూపాయల పన్నులు చెల్లించకుండా అవకతవకలు జరిపినట్లు అధికారులు నిర్ధారించారు. పెద్ద నోట్ల రద్దు సమయంలో భారీ ఎత్తున నగదు మార్పిడి జరిగినట్లు గుర్తించారు. ఈ దాడుల అనంతరం వీరి వద్ద నుండి 7 కేజీల బంగారం, దివాకరన్ నిర్వహిస్తున్న సెంగమళతాయార్ మహిళా కళాశాల విడిది గృహంలో 25 లక్షల రూపాయల నగదు తదితర వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. అలాగే శశికళకు చెందిన 315 బ్యాంకు ఖాతాలనూ నిలిపివేసినట్లు సమాచారం.