పూణే, నవంబర్ 11 : మీకు గోల్డ్ మెడల్ సాధించాలని ఉందా..! అయితే మీరు శాఖాహారులై ఉండాలి. అదేంటి శాఖాహారానికి మెడల్ కు సంబంధమేంటి అనుకుంటున్నారా.! అయితే వినండి. యూనివర్సిటీ ఆఫ్ పూణే చేసిన ప్రకటన ఏంటంటే.. “షెలార్ మామ” పేరిట గోల్డ్ మెడల్ పొందే విద్యార్థులు వెజిటేరియన్లు, మద్యం సేవించని వారై ఉండాలని, అలాంటి విద్యార్థులకు మాత్రమే గోల్డ్ మెడల్ ఇస్తామని ప్రకటించింది. ఈ విషయంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గోల్డ్ మెడల్ కావాలంటే చదవాల్సిన అవసరం లేదా? అని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంపై మహారాష్ట్ర ఎంపీ, శరద్ పవార్ కుమార్తె సుప్రియా సూలే ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ.. “మన విశ్వవిద్యాలయాలకు ఏమైంది? మెరిట్ విద్యార్థుల మాటేమిటి? అందరినీ ఒకే విధంగా చూస్తూ, నాణ్యమైన విద్యను అందించండి. విద్యార్థులను ఎందుకు విడదీస్తున్నారు? పూణే యూనివర్సిటీ అంటే నాకు ఎంతో గౌరవం ఉంది. కానీ, ఈ వార్త విని ఆశ్చర్యపోయాను” అంటూ పేర్కొన్నారు.