హైదరాబాద్, నవంబర్ 10: మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద కూలీలకు కోరుకున్నన్ని పని దినాలు కల్పిస్తామని తెలంగాణ పంచాయితీరాజ్ శాఖా మంత్రి జూపల్లి కృష్ణారావు స్పష్టం చేశారు. అసెంబ్లీలో గురువారం ఏనుగు రవీందర్ రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానమిస్తూ ఉపాధి హామీ పథకం కింద కేంద్ర ప్రభుత్వం 2017-18 ఆర్ధిక సంవత్సరం కింద 8కోట్ల పనిదినాలు మంజూరు చేయగా 2017 జూన్ నాటికి ఆ లక్ష్యం పూర్తిచేసామని ఆయన వివరించారు. మరో ఆరు కోట్ల పనిదినాలను కేంద్రాన్ని కోరగా ప్రస్తుతానికి 4కోట్ల పనిదినాలను మంజూరు చేసిందని ఆయన సభకు వివరించారు. కూలీలకు పని లేదన్న సమస్య రానీయకుండా చూసుకుంటామన్నారు.