భద్రాద్రి, నవంబర్ 10: ‘జై లవకుశ’ సినిమాలో త్రిపాత్రాభినయం చేసి విజయాన్ని అందుకున్న జూనియర్ ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీప్రణతితో కలసి భద్రాద్రి రామయ్యను దర్శించుకున్నారు. ఆయన వెంట దర్శకుడు కొరటాల శివ కూడా ఉన్నారు. వీరిని ఆలయ ఆధికారులు, అర్చకులు ఘనంగా స్వాగతం పలికారు. ఎన్టీఆర్ దంపతులు స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పించి దర్శించుకున్నారు. అనంతరం వీరికి అర్చకులు మత్రోచ్చరణల మధ్య ఆశీర్వచనం చేసి, తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఎన్టీఆర్ ను చూసేందుకు ఆయన అభిమానులు భారీ సంఖ్యలో ఆలయం వద్దకు వచ్చారు. ఈ సందర్భంగా ఆలయం వద్ద తోపులాట కూడా జరిగింది. ఎన్టీఆర్ రాక సందర్భంగా పోలీసులు కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. ఎన్టీఆర్ కూడా అభిమానులకు అభివాదం చేస్తూ, కొందరిని పలుకరిస్తూ తన దర్శనాన్ని ముగించుకున్నారు.