హైదరాబాద్, నవంబర్ 10: అక్రమాస్తుల కేసు విచారణలో భాగంగా వైకాపా అధినేత వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి శుక్రవారం సీబీఐ కోర్టుకు హాజరయ్యారు. కడప జిల్లాలో పాదయాత్రలో ఉన్న జగన్ ఒకరోజు విరామం ప్రకటించి సీబీఐ కోర్టుకు వచ్చారు. జగన్తో పాటు ఎంపీ వైవీ సుబ్బారెడ్డి, మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఇండియా సిమెంట్స్ అధినేత శ్రీనివాసన్ విచారణకు హాజరయ్యారు. కడప జిల్లా ఎర్రగుంట్లకు చేరిన ప్రతిపక్ష నేత జగన్ ప్రజాసంకల్ప యాత్రకు ఈ రోజు విరామం ప్రకటించారు. సీబీఐ కోర్టుకు హాజరుకావాల్సి ఉండటంతో యాత్రకు విరామం ప్రకటించినట్లు వైకాపా శ్రేణులు తెలిపాయి. శాసనసభ సమావేశాలను వైకాపా బహిష్కరించడంతో ప్రతిపక్షం లేకుండానే ఉభయ సభ సమావేశాలు కొనసాగుతోన్న సంగతి తెలిసిందే. తిరిగి శనివారం నుంచి పాదయాత్ర యథావిధిగా కొనసాగుతుందని పార్టీ వర్గాలు తెలిపాయి.