హైదరాబాద్, నవంబర్ 09: భారత స్వాతంత్ర్య చరిత్రలో అల్లూరి సీతారామరాజు ను ఒక వ్యక్తీగా కాకుండా మహోజ్వల శక్తి గా అభివర్ణించవచ్చు. సాయుధ పోరాటం ద్వారానే స్వతంత్రం వస్తుందని నమ్మి, దాని కొరకే తన ప్రాణాలర్పించిన యోధుడు. 27 ఏళ్ళ వయసులోనే బ్రిటిష్ సామ్రాజ్యానికి దడ పుట్టించారు. పరిమితి వనరులతో చింతపల్లి, కృష్ణదేవి పేట, రంపచోడవరం, రాజవమ్మంగి పోలీస్ స్టేషన్ లపై దాడి చేసి తెల్ల దొరలను భయపెట్టారు మన్యం వీరుడు అల్లూరి. అయితే ఆనాడు బ్రిటిష్ దొరల మెడలు వంచి, వారిని ముప్పు తిప్పలు పెట్టినా సీతారామ రాజు ను పట్టుకోవడం చేతకాక, అల్లూరి సీతారామ రాజు ను పట్టి ఇస్తే పదివేల బహుకరిస్తామని నాటి విశాఖ గెజిట్ లో 20-4-1923న కలెక్టర్ రూథర్ ఫర్డ్ జారీ చేసిన ప్రకటనను స్వామి పరి పూర్ణానంద తన ఫేస్ బుక్ ఖాతా ద్వారా పోస్టు చేశారు. ‘మన అల్లూరి సీతారామరాజు బ్రిటిష్ వారి గుండెల్లో ఎలా దడ పుట్టించాడో ఈ ఒక్క చిత్రం మనకు చెబుతుంది … వందేమాతరం అంటూ భరతమాత ఒడిలో తెల్లదొరల తూటాలకు ఒరిగిన స్వాతంత్ర్య సమరయోధుడు అప్పటికి, ఇప్పటికీ, ఎప్పటికీ మనకు ఒక స్ఫూర్తి ప్రధాత…జై హింద్ .. భారత్ మాతాకు జై’ అని ఆ పోస్ట్ లో పేర్కొన్నారు.