న్యూఢిల్లీ, నవంబర్ 09 : కాలుష్యం.. ఈ మధ్య కాలంలో ఎక్కువగా వినిపిస్తున్న పదం. ఇటీవల దేశ రాజధాని ఢిల్లీలో కాలుష్య౦ బాగా పెరిగిపోయి ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. పాఠశాలకు సైతం సెలవులను ప్రకటించారు. అయితే కాలుష్యాన్ని కొలిచే చార్టులో ‘0’ నుండి ‘500’ వరకు రీడింగ్ ఉంటుంది. ఈ రీడింగ్ లలో 100 దాటితే కాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరినట్టు అర్థం. ఒకవేళ అదే రీడింగ్ 400 దాటింది అనుకోండి అది ఊపిరితిత్తులకు అత్యంత ప్రమాదకరం. కాగా ఢిల్లీలో గత రెండు రోజులుగా ఈ కాలుష్యం పెరిగి పోయి తారాస్థాయికి చేరింది. ఈ నేపథ్యంలో యూఎస్ ఎంబసీలోని పొల్యూషన్ మానిటర్ వాతావరణ గణాంకాలను వెల్లడించింది. ఆ వివరాల ప్రకారం రాజధానిలో ఇప్పటికే 471 కి చేరిన కాలుష్య రీడింగ్ ఇప్పుడు మరింత పెరిగి 726 కు చేరింది. దీని వల్ల ఊపిరితిత్తులకు, శ్వాస సంబంధిత వ్యాధులను తీవ్రంగా దెబ్బ తీస్తాయి. ఈ స్థాయిలో ఉన్న గాలిని పీల్చుకోవడం వలన మానవాళికి అత్యంత ప్రమాదకరమని ఇప్పటికే టాప్ డాక్టర్స్ హెచ్చరికలు జారీ చేశారు. ఈ విషయంపై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ మాట్లాడుతూ... ఈ సమస్య పక్క రాష్ట్రాల కారణంగా వస్తున్నందునా వారితో చర్చిస్తున్నామని వ్యాఖ్యానించారు. దీనిపై సర్ గంగారామ్ ఆసుపత్రి లంగ్ సర్జన్ అరవింద్ కుమార్ స్పందిస్తూ.. ఒక డాక్టర్ గా పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాలని అభిప్రాయపడతున్నానని, ప్రజలను రక్షించాలంటే, వారిని ఢిల్లీ దాటించడమే ఉత్తమమని, అన్ని పాఠశాలలు, ఆఫీసులు మూసివేయాలని, రహదారుల పైకి ట్రాఫిక్ ను అనుమతించరాదని అన్నారు.