హైదరాబాద్, నవంబర్ 09: తెలంగాణ వచ్చేనాటికి 2,700 ల మెగావాట్ల విద్యుత్ లోటున్న రాష్ట్రంలో మా 40 నెలల పాలనలో అన్ని రంగాలకు 24 గంటల విద్యుత్ సరఫరా జరుగుతోందని సీఎ౦ కేసీఆర్ సంతోషం వ్యక్తం చేశారు. నిన్న జరిగిన అసెంబ్లీ సమావేశంలో కేసీఆర్ మాట్లాడుతూ ఉమ్మడి రాష్ట్రంలో డిమాండ్ కు తగ్గ సరఫరా జరగలేదన్నారు. ప్రణాళిక లోపం, గత పాలకుల నిర్లక్ష్య వైఖరి కారణంగా విద్యుత్ సంక్షోభం ఏర్పడి నిత్యం విద్యుత్ కోతలు, పరిశ్రమలకు పవర్ హాలిడే లు, పంటలు ఎండిపోవడం జరిగాయని తెలిపారు. 94 వేల కోట్లతో మిగులు విద్యుత్ రాష్ట్రంగా తెలంగాణ ఆవిష్కరించబోతుందని ఆయన తెలిపారు. రాష్ట్రంలో ఉన్న 23 లక్షల పంపు సెట్లకు వచ్చే రబీ నుంచి శాశ్వత ప్రాతిపాదికన 24 గంటల విద్యుత్ సరఫరా చేస్తామని సగర్వంగా ప్రకటించారు. రైతులు ఆటో స్టార్టర్లను తొలగించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. నేడు తెలంగాణ లో స్థాపిత విద్యుదుత్పత్తి సామర్ధ్యం 14,555 మెగావాట్లు ఉంటే మరో 13,752 మెగావాట్ల ఉత్పతికి కొత్త ప్లాంట్ల నిర్మాణం జరుగుతోందని కేసీఆర్ పేర్కొన్నారు. సౌర విద్యుత్ ఉత్పత్తిలో దేశంలో అగ్ర స్థానంలో ఉన్నామని, తలసరి విద్యుత్ వినియోగంలో జాతీయ సగటు కంటే మనదే ఎక్కువ ఉన్నదని కేసీఆర్ వివరించారు. అలాగే విద్యుత్ పంపిణీ, సరఫరా నాణ్యతలో రాజిపడేదిలేదని ఆయన సభకు తెలిపారు.