అమరావతి, నవంబర్ 09 : ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏపీసీఆర్డీయే సమీక్షలో భాగంగా అమరావతిలో వీఐపీ గృహ నిర్మాణాలపై చర్చించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అఖిల భారత సర్వీసు అధికారులు, గెజిటెడ్, నాన్ గెజిటెడ్ అధికారులు, 4 వ తరగతి ఉద్యోగుల కోసం మొత్తంగా 5 క్లస్టర్లలతో 68 టవర్లలో ఈ గృహ నిర్మాణాలను చేపట్టనున్నట్లు వివరించారు. ఒక్కో బ్లాకులో నాలుగు బంగ్లాల చొప్పున ఒక్కో టవర్లో 12 అంతస్తులు ఉంటాయంటూ ఎంపిక చేసిన డిజైన్ లను చూపించారు. ఈ బంగళాల విస్తీర్ణం ఒక్కొక్కరికి ఇలా ఉంది. హైకోర్టు చీఫ్ బంగ్లాను 2500 చదరపు గజాల్లో, 9000 చదరపు అడుగుల విస్తీర్ణంతో, గజానికి రూ.3,162 వ్యయంతో నిర్మించనున్నారు. హైకోర్టు జడ్జిల కోసం 36 బంగ్లాలను ఒక్కొక్కటి 2000 చ.గ., అసెంబ్లీ స్పీకర్ కు, శాసన మండలి చైర్మన్ బంగ్లాలను ఒక్కొక్కటి 2000 చ.గ., చట్ట సభల డిప్యూటీ స్పీకర్, డిప్యూటీ చైర్మన్ కోసం 2000చ.గ. లలో, 5000 చదరపు అడుగులతో నిర్మించనున్నారు. అలాగే పీసీసీఎస్-డీజీఎఫ్ బంగ్లాను 2000 చ.గ., స్పెషల్ చీఫ్ సెక్రెటరీ, ప్రిన్సిపల్ సెక్రటరీల కోసం టైప్-1 లో 25 బంగ్లాలను ఒక్కొక్కటి 1500 చ.గ.ల్లో 5000 చదరపు అడుగుల విస్తీర్ణంతో నిర్మించనున్నట్లు వెల్లడించారు.