హైదరాబాద్, నవంబర్ 9 : ఇంజనీరింగ్ కాలేజీలకు అనుమతి ఇవ్వాలని ఏఐసీటీఈ లేఖ రాశామని డిప్యూటి సీఎం కడియం శ్రీహరి పేర్కొన్నారు. తెలంగాణ శాసన మండలిలో పలువురు సభ్యులు అడిగిన ప్రశ్నలకు బదులుగా ఆయన ధీటుగా సమాధానమిచ్చారు. శాస్త్రీయ దృక్పథం లేకుండా గత ప్రభుత్వాలు అనుమతులిచ్చేశాయని ఆరోపించారు. ఆ విధంగా తెలంగాణ ప్రభుత్వం చేయబోదని స్పష్టం చేశారు. తెలంగాణలో మొత్తం 251 ఇంజనీరింగ్ కాలేజీలు ఉండగా, అందులో ఒక్క రంగారెడ్డి జిల్లాలోనే 122 కళాశాలలున్నాయని, ఆదిలాబాద్ జిల్లాలో ఒకే ఒక కాలేజి ఉందని తెలిపారు. అన్నీ జిల్లాల్లో ఇంజనీరింగ్ కాలేజీల ఏర్పాటుకు ప్రణాళిక రూపొందించి అమలు చేస్తామని హామీ ఇచ్చారు. ఇందులో భాగంగా 14 అవసరమైన రంగాలను గుర్తించి, ఆయా కోర్సులను అందించే ఇంజనీరింగ్ కాలేజీలకే అనుమతి ఇవ్వాలని, లేఖ రాశామని వివరించారు.