ముంబై, నవంబర్ 09 : భారత్ క్రికెట్ లో ముంబై కి ప్రత్యేకమైన అనుబంధం ఉంది. ఈ దేశవాళీ లీగ్ ఎంతోమంది ప్రతిభావంతులను క్రీడాకారులను దేశం తరుపున ఆడేందుకు దోహదం చేసింది. అందులో ముఖ్యంగా విజయ్ మర్చంట్, సునీల్ గావస్కర్, అజిత్ వాడేకర్, దిలీప్ వెంగ్సర్కార్, సచిన్ టెండూల్కర్, పాలీ ఉమ్రీగర్, వినూ మన్కడ్, ఫరూఖ్ ఇంజినీర్ ఇలా చాలా మంది దిగ్గజాలను అందించింది. ప్రస్తుతం ముంబై రంజీ జట్టు ఒక అరుదైన రికార్డు నెలకొల్పనుంది. గురువారం బరోడాతో వాంఖడె స్టేడియంలో జరిగే పోరు ముంబై కి 500వ రంజీ మ్యాచ్. రంజిల్లో ఎక్కువ మ్యాచ్ లు ఆడటమే కాదు.. ఏకంగా 41 సార్లు రంజీల్లో విజేతగా నిలిచి చరిత్ర లిఖించిన ఘనత ముంబై కి సొంతం. ఈ సందర్భంగా సచిన్ మాట్లాడుతూ" దేశంలోనే అత్యంత గొప్ప క్రికెటర్లను తీర్చిదిద్దిన ఖ్యాతి ముంబై కి దక్కుతుంది. మేమందరం ముంబయి తరఫున రంజీల్లో ఆడటం ద్వారా ఎంతో నేర్చుకున్నాం" అని తెలిపారు.