న్యూఢిల్లీ, నవంబర్ 08 : ఢిల్లీలో పొగమంచు తీవ్రస్థాయిలో ఏర్పడడంతో నేటి నుంచి జాతీయ రాజధానిలో పాఠశాలలను మూసివేస్తున్నట్లు నిన్ననే ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే, ఈ ఆదేశాలను మరికొన్ని రోజులు పొడిగించారు. ఇదిలా ఉండగా బుధవారానికి 14 డిగ్రీల సెల్సియస్ నమోదైంది. దీంతో ఢిల్లీలో దట్టమైన పొగమంచు అలముకోవడంతో, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నేడు ఉదయం ఆగ్రా-నోయిడా యమునా ఎక్స్ప్రెస్ వేపై పొగమంచు కారణంగా దాదాపు 18 కార్లు ఒకదాన్నొకటి ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో ఆరుగురు గాయపడినట్లు అధికారులు తెలిపారు. పొగ మంచు కారణంగా ఎదురుగా వస్తున్న వాహనాలను గుర్తించకపోవడంతో ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు వెల్లడించారు. ఢిల్లీలో పగటి వేళ ఉష్ణోగ్రతలు కూడా తగ్గుముఖం పట్టాయి. దీంతో తీవ్ర స్థాయిలో ప్రమాదాలు చోటుచేసుకోవడంపై అధికారులు అప్రమత్తమై ఉండాలని పై అధికారులు సూచిస్తున్నారు.