హైదరాబాద్, నవంబర్ 08 : తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వం చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు పై గ్రీన్ ట్రైబ్యునల్ ఆదేశాలను న్యాయస్థానం రద్దు చేసింది. రూ.80 వేల కోట్ల భారీ బడ్జెట్తో 15 కొత్త జిల్లాల పరిధిలోని దాదాపు 18 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే లక్ష్యంతో ప్రతిష్ఠాత్మకంగా కాళేశ్వరం ప్రాజెక్టును తెరాస ప్రభుత్వం చేపట్టిన విషయం తెలిసిందే. అయితే పలువురు నిర్వాసితులు ఎలాంటి అనుమతులు లేకుండా ఈ ప్రాజెక్టును చేపట్టారని గ్రీన్ ట్రైబ్యునల్ను ఆశ్రయించారు. దీంతో విచారణ జరిపిన ట్రైబ్యునల్ పర్యావరణ పై అనుమతులు తీసుకోలేదని చెబుతూ పనులు నిలిపివేయాలని ఆదేశించింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ అంశంపై హైకోర్టును ఆశ్రయించింది. అనుమతులు లేకుండా ప్రభుత్వం అటవీ ప్రాంతంలో పనులు చేపట్టరాదని కోర్టు స్పష్టం చేసింది. ఒక్క చెట్టును కూడా నరకవద్దని తేల్చిచెప్పింది. తాగునీటి ప్రాజెక్టుల విషయంలో మాత్రం కోర్టు సడలింపులు ఇచ్చింది.