వడోదర, నవంబర్ 08: దేశంలో పెరిగిపోతున్న లింగ మార్పిడి సంఘటనలకు మరో ఉదాహరణ.. వడోదరకు చెందిన 31 ఏళ్ల యువకుడు యోగేష్ వైష్ణవ్ లింగ మార్పిడి చేయించుకొని మాన్వి వైష్ణవ్గా మారి సోషల్ మీడియాలో సంచలనం రేపుతుంది. అబ్బాయిగా జన్మించిన యోగేష్ కొన్నేళ్ళ వరకు అబ్బాయిలానే జీవించాడు. అయితే ఆ తర్వాతి నుంచి తాను అమ్మాయినని భావిస్తూ యువతుల దుస్తులను ధరించడం మొదలుపెట్టి, చివరికి ఇలా లాభం లేదనుకుని ఏకంగా లింగ మార్పిడి చేయించుకుని యోగేష్ వైష్ణవ్ కాస్తా మాన్వి వైష్ణవ్గా మారిపోయింది. ప్రస్తుతం మోడల్గా రాణించేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నానని తెలిపిన మాన్వి 2012 గుజరాత్ ఎన్నికల్లో యోగేష్ గానే ఓటేసింది. డిసెంబరు, 2015లో లింగమార్పిడి శస్త్రచికిత్స చేయించుకుని కొత్త ఓటర్ కార్డుకు దరఖాస్తు చేసుకుని, మాన్విగా కొత్త కార్డును కూడా సంపాదించింది. గత ఎన్నికల్లో యువకుడిగా ఓటు వేసిన యోగేష్ వైష్ణవ్ ఈసారి మాన్వి వైష్ణవ్గా ఓటు వేసేందుకు పోలింగ్ కేంద్రానికి రానున్నారు. ఇది త్వరలో జరగనున్న గుజరాత్ ఎన్నికల్లో ఎన్నికల అధికారులకు నిజంగా విచిత్ర పరిస్థితే. మోడల్ గా రాణించటం తన లక్ష్యంగా ప్రకటించిన మాన్వి కి విషెస్ చెబుతూ సోషల్ మీడియాలో కామెంట్లు వెల్లువెత్తుతున్నాయి.