నాగపూర్, నవంబర్ 07 : భారత్ లో జరుగుతున్నా జాతీయ సీనియర్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ చివరి పోరుకు రంగం సిద్ధమైంది. ఈ రోజు జరిగే మహిళాసింగిల్స్ ఫైనల్లో ఒలింపిక్ పతక విజేతలైన సైనా నెహ్వాల్, పీ.వీ. సింధులు తలపడనుండగా, పురుషుల సింగిల్స్ ఫైనల్లో ప్రణయ్తో, శ్రీకాంత్ లు అమీతుమీ తేల్చుకోనున్నారు. మంగళవారం జరిగిన మహిళా సింగిల్స్ సెమీస్ లో టాప్ సీడ్ సింధు 17-21, 21-15, 21-11తో మరో తెలుగుతేజం గద్దె రుత్విక శివానిపై పోరాడి గెలుపొందంగా, మరో సెమీస్ లో రెండో సీడ్ సైనా నెహ్వాల్ 21-11, 21-10తో ప్రభుదేశాయ్ పై విజయం సాధించారు. పురుషుల సింగిల్స్ సెమీస్ లో టాప్ సీడ్ శ్రీకాంత్ 21-16, 21-18తో లక్ష్య సేన్ ను ఓడించంగా, మరో మ్యాచ్ లో రెండో సీడ్ ప్రణయ్ 21-14, 21-17తో శుభంకర్ డేపై గెలిచి ఫైనల్లోకి దూసుకెళ్ళారు. మిక్స్డ్ డబుల్స్లో సాత్విక్ సాయిరాజ్-అశ్విని పొన్నప్ప, ప్రణవ్ చోప్రా-సిక్కిరెడ్డి జోడీలు ఫైనల్ చేరాయి. మహిళల డబుల్స్లో సిక్కిరెడ్డి-అశ్విని పొన్నప్ప, సన్యోగిత-ప్రజక్త సావంత్ తుది సమరంలో తమ అదృష్టాన్ని పరిక్షించుకొనున్నారు.