న్యూఢిల్లీ, నవంబర్ 08 : చిన్ననాటి నుండే నృత్యంపై మక్కువ పెంచుకున్నారు. పదేళ్ల వయస్సు వచ్చే సరికి ఎన్నో నృత్య ప్రదర్శనలతో తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అంతే కాదండోయ్..! సరోజిని నాయుడు, రవీంద్రనాథ్ ఠాగూర్ లాంటి గొప్ప గొప్ప వాళ్ల ముందు తన ప్రదర్శనలు ఇచ్చి దేశ విదేశాలలోనూ అందరి మన్ననలు పొందారు. ఠాగూర్ నుండి నృత్య సామ్రాజ్ఞి అనే బిరుదును కూడా అందుకున్నారు. ఇంతకీ ఎవరు ఈమె అనుకుంటున్నారా..? ఆమె ప్రముఖ నృత్య కళాకారిణి సితార దేవి. కోల్కతాకు చెందిన సితార 1920, నవంబర్ 8న జన్మించారు. ఈ రోజు ఆమె జయంతి సందర్భంగా గూగుల్ ఆమెకు నివాళులర్పిస్తూ ఆమె నృత్యం చేస్తున్న ఫోటోతో ఒక డూడుల్ ను ఏర్పాటు చేసింది. సితార తండ్రి సుఖ్దేవ్ మహరాజ్ స్వతహాగా మంచి కథక్ డాన్సర్ కావడంతో చిన్ననాటి నుండి నృత్యంపై ఇష్టం పెంచుకున్న ఆమె. పలు హిందీ చిత్రాల్లోనూ నటించారు. తన నృత్యంతో బాలీవుడ్ ని సైతం మంత్రముగ్ధుల్ని చేసింది. బాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ సైతం ఆమె నుండి నృత్యాన్ని అందిపుచ్చుకున్నారు. ఇంత గొప్ప కళాకారిణి ప్రతిభకు కేంద్ర ప్రభుత్వం 1973లో పద్మశ్రీతో సత్కరించింది. 2014 నవంబర్ 25న కన్ను మూసిన సితార జ్ఞాపకార్థంగా గూగుల్ డూడుల్ తో ఆమెను గౌరవించింది.