న్యూఢిల్లీ, నవంబర్ 08 : దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యంతో ప్రమాదకరంగా మారినందున నేడు ప్రాథమిక పాఠశాలలన్నీ మూసివేస్తున్నట్లు ఉపముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి మనీశ్ సిసోడియా ప్రకటించారు. ఏటా ఢిల్లీ ఈ నెలల్లో గ్యాస్ ఛాంబర్లా మారిపోతుందని ముఖ్యమంత్రి కేజ్రీవాల్ పేర్కొన్నారు. దీంతో కాలుష్యాన్ని దృష్టిలో ఉంచుకొని పాఠశాలలను కొన్ని రోజుల పాటు మూసివేయాల్సిందిగా ఢిల్లీ సీఎం ట్విటర్ ద్వారా మంత్రి మనీశ్ సిసోడియాను కోరారు. పాఠశాలల్లో కొన్ని రోజులు ఉదయం వేళ నిర్వహించే ప్రార్థనలతో సహా, ఆటలు కార్యక్రమాలను నిర్వహించకూడదని పాఠశాల యాజమాన్యాలను ఆయన ఆదేశించారు. చిన్నారులందరూ తప్పకుండా ముఖాలకు మాస్కులు ధరించాల్సిందిగా అధికారులు తెలిపారు. అయితే, ఈ కాలుష్యాన్ని నియంత్రించేందుకు ఢిల్లీ అధికారులు చర్యలు చేపట్టారు. ఈ నేపథ్యంలోనే పార్కింగ్ ఫీజును పెంచుతున్నట్లు ప్రకటించారు. దీంతో పాటు సరి-బేసి విధానాన్ని కూడా తీసుకురానున్నట్లు సమాచారం.