నోట్ల రద్దుతో ఎన్నో లాభాలు : ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ

SMTV Desk 2017-11-07 17:29:39  Demonetisation, Finance Minister Arun Jaitley, face book post, delhi

న్యూఢిల్లీ, నవంబర్ 07 : మోదీ సర్కార్ అమలు చేసిన పెద్దనోట్ల రద్దు విషయంలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ విమర్శలు చేస్తున్న తరుణంలో ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ దీటైన సమాధానమిస్తూ నోట్ల రద్దు లాభాలను వివరించారు. పెద్దనోట్ల రద్దు నిర్ణయం తీసుకుని ఏడాది పూర్తవుతున్న సందర్భంగా ‘నల్లధన నిర్మూలన దినం’గా జరిపేందుకు కేంద్రం సిద్దమవుతుంది. ఈ నేపధ్యంలో కేంద్రం చేపట్టిన నోట్ల రద్దు నిర్ణయాన్ని భారత ఆర్థిక వ్యవస్థలో ‘కీలక మలుపు’గా అభివర్ణించారు. ఈ మేరకు ఆయన నేడు ఫేస్‌బుక్‌లో వరుసగా పోస్టులు చేశారు. నోట్ల రద్దు వల్ల కలిగే లాభాలు భవిష్యత్‌ తరాల వారు ఈ అభివృద్ధిని చూసి గర్విస్తారు. తాము నిజాయతీ గల ఆర్థిక వ్యవస్థలో జీవిస్తున్నామని, అందుకు కారణమైన 2016 నవంబర్‌ను వారు గుర్తుంచుకుంటారని జైట్లీ పోస్ట్‌ చేశారు. నోట్ల రద్దు తరువాత ప్రస్తుతం ఆర్థిక వ్యవస్థలో ఉన్న ప్రతి ఒక్క రూపాయికి లెక్క ఉందని చెప్పారు. ఈ సందర్భంగా నోట్ల రద్దు వల్ల కలిగిన ప్రయోజనాలను తన పోస్టింగులో వివరించారు. పెద్ద నోట్ల రద్దు తర్వాత 2.97 లక్షల డొల్ల కంపెనీలను గుర్తించడం సాధ్యపడింది. ఒక్కో కంపెనీకి వందకు పైగా బ్యాంకు ఖాతాలు ఉండడం వెలుగుచూసింది. ఓ కంపెనీ అయితే ఏకంగా 2,134 ఖాతాలు కలిగినట్లు గుర్తించింది. క్రెడిట్‌ కార్డుల ద్వారా రూ.3.3 లక్షల కోట్ల విలువైన 110 కోట్ల లావాదేవీలు, డెబిట్‌ కార్డు ద్వారా అంతే విలువైన 240 కోట్ల లావాదేవీలు జరిగాయి. ఈ ఏడాది ఆగస్టు 5 వరకు 56 లక్షల మంది వ్యక్తిగత పన్ను చెల్లింపు దారులు తమ రిటర్నులు దాఖలు చేశారు. గతేడాది ఆ సంఖ్య 22 లక్షలు మాత్రమే. నక్సల్స్‌ కార్యకలాపాలు చాలా వరకు నిలిచిపోయాయని తన ఫేస్‌బుక్‌ పోస్టింగులో వివరించారు. ఇలా సంవత్సరం గడిచే లోపు పెద్దనోట్ల రద్దుతో మన దేశం పొందిన లాభాలపై ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ విపక్షాలకు దీటుగా సమాధానమిస్తూ, నష్టం వాటిల్లాకుండా లాభాలు చూసినందుగాను సంతోషం వ్యక్తం చేశారు.