న్యూఢిల్లీ, నవంబర్ 7 : నగరమంతటా ఎక్కడ చూసినా చుట్టూ దట్టంగా అలుముకున్న మంచు, ఉదయం 10 గంటలైన కూడా మంచు నుండి తేరుకోలేక పోయింది నగరం. అసలు విషయం ఏంటంటే అది మంచు కాదు.. కాలుష్య పొగ. దేశ రాజధానిలో కాలుష్యం తీవ్ర స్థాయిలో పెరిగి, అది పొగ రూపంలో చుట్టూ అలుముకుంది. ఈ పొగ వల్ల వాహనదారులు పట్ట పగలే లైట్లు వేసుకొని ప్రయాణించారు. రహదారిపై 200 మీటర్ల దూరం నుంచి వస్తున్న వాహనాలు కూడా కనబడనంతగా పొగ వ్యాపించింది. ఢిల్లీలోని ఇండియా గేట్, రాజ్పథ్, ఎన్సీఆర్, గురు గ్రామ్ ప్రాంతాల్లో పొగ కాలుష్యం తీవ్ర స్థాయికి చేరుకుంది. దీంతో అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. కాలుష్య తీవ్రత తగ్గే వరకు హస్తిన వాసులు ఎవరు బయటికి రావొద్దని హెచ్చరించారు. పొగ మంచులా ఉన్న ఈ వాతావరణ ఫొటోలను నగరవాసులు సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.