ఇంటర్నెట్డెస్క్, నవంబర్ 07 : ఇటలీ అధికారులు మధ్యదరా సముద్రం వైపుకు రెక్కీ నిర్వహిస్తుండగా 14 నుంచి 18 ఏళ్ల వయసు ఉన్న అమ్మాయిల మృతదేహాలు తేలుతూ కనిపించడంతో అధికారులు వెంటనే సిబ్బంది సహాయంతో మొత్తం 26 మృతదేహాలను వెలికితీశారు. దీంతో అధికారులు పలు అనుమానాలు వ్యక్తం పరిచారు. అయితే , లిబియాలో అమ్మాయిల అక్రమ రవాణా ఎక్కువగా ఉంటుంది. వివిధ దేశాల నుంచి ఇక్కడకు అమ్మాయిలను తీసుకొచ్చి వారిని లైంగికంగా వేధిస్తుండడంతో, ఆ నరకం నుంచి బయటపడేందుకు కొందరు అమ్మాయిలు ఇలా ప్రమాదకరంగా సముద్రాన్ని దాటే ప్రయత్నం చేసి ప్రాణాలు కోల్పోతున్నారని స్థానిక అధికారులు చెబుతున్నారు. మరో కోణంలో చూస్తే నైజర్, నైజీరియా దేశాలకు చెందిన వలసదారులు అయి ఉంటారని భావిస్తున్నారు. ప్రస్తుతం మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు.