హైదరాబాద్, నవంబర్ 07 : నిర్మల్ జిల్లా కుప్టీ వద్ద ఐదున్నర టీఎంసీల బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నిర్మించనున్నట్లు నీటి పారుదల శాఖమంత్రి హరీష్రావు తెలిపారు. మిషన్ కాకతీయలో భాగంగా నాలుగో విడత చెరువుల ఎంపిక పూర్తిచేస్తామని వెల్లడించారు. శాసనసభ ప్రశ్నోత్తరాల సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వ సంస్థ నాబ్కాన్ చేపట్టిన అధ్యయనంలో చెరువుల పునరుద్ధరణ ద్వారా 51.5 శాతం సాగు పెరిగినట్లు వెల్లడించిందన్నారు. పథకంలో భాగంగా మూడు దశల్లో రూ.7,357.42 కోట్ల పనులు జరిగాయని, దానిలో రూ.2,630.10 కోట్లు మంజూరు చేసినట్లు తెలిపారు. కుప్టి జలాశయంపై స్పందిస్తూ.. కడెం ప్రాజెక్టు చివరి ఆయకట్టు రైతులకు ఈ రిజర్వాయర్ ద్వారా సాగు నీరు అందిస్తామన్నారు.