న్యూఢిల్లీ, నవంబర్ 6 : ప్రతి ఒక్కరు చిన్న, మధ్య తరగతి వారు వినియోగించుకునే నిత్యావసరాల వస్తువులపై, జీఎస్టీ మండలి.. ప్రస్తుతం 28 శాతం ఉన్న పన్నును తగ్గించే అంశాన్ని తీసుకురానుంది. ఈ నెల 10న కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ నేతృత్వంలో జరగబోయే జీఎస్టీ మండలి సమావేశంలో, కొన్ని నిత్యావసర వస్తువులపై పన్నులు తగ్గించేలా కీలక నిర్ణయం తీసుకోబోతున్నారు. ఇప్పటికే వందకు పైగా వస్తువులపై పన్నులు తగ్గించారు. ముఖ్య౦గా పన్ను తగ్గించడానికి కారణం, ప్లాస్టిక్ పరిశ్రమలో 80 శాతం వాటా.. చిన్న, మధ్య తరహా వ్యాపారాలదేనని రెవెన్యూ విభాగానికి ఇటీవల తయారీ దారులు వినతిపత్రం అందించారు. ఈ విషయంపై జీఎస్టీ మండలి అధికారులు ఫర్నీచర్, ఎలక్ట్రిక్ స్విచ్లు, ప్లాస్టిక్ పైపుల పన్ను రేట్లపై తిరిగి పరిశీలిస్తామంటున్నారు. కార్మికులు తయారుచేసే హ్యాండ్ మేడ్ ఫర్నీచర్, కొన్ని ప్లాస్టిక్ వస్తువులపై 18 శాతం పన్ను ఉన్నప్పటికీ షవర్ బాత్, వాష్ బేసిన్, సీట్లు, వాటి కవర్లు తదితర వస్తువులపై 28 శాతం పన్ను విధిస్తున్నారు. వీటన్నింటిపై పన్ను రెట్లు క్రమబద్ధీకరించి 28 శాతం నుంచి 18 శాతం వరకు భారాన్ని తగ్గించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.