హైదరాబాద్, నవంబర్ 05 : ఇటీవల తరచూ వార్తల్లో వినిపిస్తున్న పేరు ప్రొ. కంచ ఐలయ్య. విశ్వ బ్రాహ్మణులను విమర్శిస్తూ రాసిన పుస్తకం ద్వారా వివాదాస్పదుడైన కంచ ఐలయ్య మరోసారి వార్తల్లోకెక్కాడు. సికింద్రాబాద్ లో జరిగిన టీమాస్ సమావేశంలో ఆయన పాల్గొని, ప్రసంగించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ సచివాలయ మార్పు నిర్ణయం నేపధ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ పై ప్రొఫెసర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సచివాలయానికి వాస్తు బాగోలేదని అంటున్నారని, వాస్తు బాగోలేకపోతే తెలంగాణ రాష్ట్రం ఎలా వచ్చిందని ఆయన ప్రశ్నించారు. సచివాలయానికి ఖర్చు పెట్టే బదులు, ఆ నిధులను పత్తి రైతుల సమస్యలను పరిష్కరించేందుకు వినియోగిస్తే బాగుంటుందని అన్నారు. ఆత్మహత్యకు పాల్పడిన ప్రతి పత్తి రైతు ఇంట్లో టీమాస్ నిద్ర చేస్తుందని, పత్తి రైతులు కూడా హిందువులేనని తనను విమర్శించే పీఠాధిపతి వారి సమస్యలపై ఎందుకు మాట్లాడటం లేదని విమర్శించారు.