తిరుపతి, నవంబర్ 05: ఉద్యోగుల కోసం త్వరలోనే కొత్త వేతన సవరణ సంఘాన్ని(పీఆర్సీ) వేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. ఏపీ ఎన్జీఓల 20వ రాష్ట్రస్థాయి మహాసభలు రెండు రోజులపాటు తిరుపతిలో జరిగాయి. శనివారం నాటి ముగింపు సమావేశానికి ముఖ్యమంత్రి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. "గత పీఆర్సీకి సంబంధించి రెండు డీఏలు పెండింగ్లో ఉన్నాయి. త్వరలోనే నిర్ణయం తీసుకుని ఒకటి తర్వాత మరొకటి ఇస్తాం అని వివరించారు. నాడు 9 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా కష్టపడి అభివృద్ధి అంటే ఏంటో చేసి చూపించా. ఆ సమయంలోనే ఉద్యోగులపై ఒత్తిడి తీసుకొచ్చా. రాష్ట్ర విభజన సమయంలో ఉద్యోగులు ఉద్యమానికి నాయకత్వం వహించి ఎంతో సమర్థంగా నడిపించారు. ఆ తర్వాత ఎన్నికల్లో వేరే వాళ్లు వస్తే జీతాలు వస్తాయో రావో అన్న భయంతో నన్ను గెలిపించారు" అని అన్నారు. ఉద్యోగుల్లో 90శాతం కంటే ఎక్కువ మంది బాగా పనిచేస్తున్నారు. నాలుగో తరగతి సిబ్బంది పదవి విరమణను 62 ఏళ్లకు పెంచే అంశంపై ఆలోచిస్తానని చంద్రబాబు తెలిపారు.