సిమ్లా, నవంబర్ 05 : సందర్భం దొరికితే తీవ్ర విమర్శలు చేసే మోదీ మరోసారి కాంగ్రెస్ పై విరుచుకుపడ్డారు. హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మోదీ మాట్లాడుతూ.. కాంగ్రెస్ నేతల బినామీ ఆస్తులన్నిటిని వెలికి తీస్తానని, అందుకే వారు భయపడుతున్నారని ఆయన అన్నారు. దేశంలో సుదీర్ఘంగా అధికారాన్ని అనుభవించిన కాంగ్రెస్, ఒక్క మంచి పని చెయ్యలేదని దుయ్యబట్టారు. మేము దేశాన్ని శుద్ధి చేసే యజ్ఞం చేస్తుంటే కాంగ్రెస్ వెన్నులో వణుకు పుడుతు౦దని ఆయన పేర్కొన్నారు. దేశాన్ని కాంగ్రెస్ రహిత దేశంగా చేయాలని ఆయన పిలుపునిచ్చారు. హిమాచల్ లో కాంగ్రెస్ ఓటమిని అంగీకరించిందని, అందుకే ఒక్క నేత కూడా ఇటువైపు రావటంలేదని మోదీ పేర్కొన్నారు. నవంబర్ 8న బ్లాక్ డే నిర్వహించాలని కాంగ్రెస్, ఇతర విపక్షాలు ప్రయత్నిస్తున్నాయని.. కానీ ఇది అసలైన ‘బ్లాక్మనీడే’ అనే విషయం వారికి అర్థం కావటం లేదన్నారు. "కొవ్వొత్తుల ర్యాలీలు, కొందరిని వెనకేసుకుని వస్తే నేను భయపడను. సర్దార్ పటేల్ శిష్యుడిగా ఇలాంటి కుట్రలకు తలొగ్గేది లేదు" అని మోదీ ప్రకటించారు. బీజేపి అగ్రనేతలు అద్వాని, వాజ్ పేయి వంటి నేతల పేర్లు చెప్పకుండా పటేల్ పేరు చెప్పడం ఆసక్తి కలిగించే అంశమే.