న్యూఢిల్లీ, నవంబర్ 04 : 2011 ప్రపంచకప్ సగటు భారతీయ క్రికెట్ అభిమాని సగర్వంగా ఆనందించిన క్షణం.. 28 ఏళ్ల సుదీర్ఘ విరామం తరువాత మహేంద్ర సింగ్ధోనీ నేతృత్వంలో టీమిండియా సాంతగడ్డపై ప్రపంచకప్ గెలిచింది. భారత్ తొలిసారి 1983లో క్రికెట్ దిగ్గజం కపిల్దేవ్ నాయకత్వంలో ప్రపంచకప్ అందుకుంది. ఆ తరువాత 2011లో ముంబయిలోని వాంఖడే మైదానంలో శ్రీలంకపై భారత్ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. సిక్స్తో భారత్కు విజయాన్ని అందించిన ధోనీ మాత్రం ఈ మ్యాచ్ అనంతరం ఏడ్చేశాడట. ఈ విషయం ప్రముఖ ప్రాతికేయుడు రాజ్దీప్ సర్దేశాయ్ రచించిన ‘డెమోక్రసీ-ఎలెవన్’ ద్వారా వెలుగులోకి వచ్చింది. ఫైనల్లో 275 పరుగుల లక్ష్యాన్ని చేధించే క్రమంలో కోహ్లి ఔట్ తో మైదానంలోకి వచ్చిన ధోని 49వ ఓవర్లో రెండో బంతిని సిక్స్గా మలిచి భారత్కు మరుపురాని విజయాన్ని అందించాడు. దీంతో ఆటగాళ్ళందరూ ఒకరినొకరు హత్తుకుంటూ సంబరాలు చేసుకున్నారు. కానీ, కెమెరా కంటికి చిక్కని ఓ సన్నివేశం గురించి ధోనీ తెలిపాడు. "ఔను, నేను ఏడ్చాను. కాకపోతే అది కెమెరాలకు చిక్కలేదు అంతే. దేశానికి ఇంత గొప్ప విజయం అందించిన తర్వాత ఎవరైనా భావోద్వేగానికి గురవ్వడం సహజమే. నేను కూడా అంతే. హర్భజన్ వచ్చి నన్ను హత్తుకున్నప్పుడు నేను నా భావోద్వేగాన్ని ఆపుకోలేకపోయా ఏడ్చాను. తలదించుకోవడంతో అది కెమెరాకు చిక్కలేదు" అని రాజ్దీప్ రాసిన పుస్తకంలో ధోనీ వివరించాడు. ఆ మధుర క్షణాలు చూసిన మనకే కన్నీళ్ళు ఆగలేదు. అలాంటిది దేశం తరుపున విజయం అందించిన ధోని ఎలా ఉండగలడు చెప్పండి.