న్యూఢిల్లీ, నవంబర్ 04 : ప్రపంచానికి కిచిడీని జాతీయ వంటకంగా చాటి చెప్పాలనే లక్ష్యంతో ఏకంగా 800 కిలోల కిచిడీని తయారు చేశారు. దేశరాజధాని ఢిల్లీలోని వరల్డ్ ఫుడ్ ఇండియా ఫెయిర్ వేదికగా ప్రముఖ పాకశాస్త్ర నిపుణుడు సంజీవ్కపూర్ నేతృత్వంలో ఈ కిచిడీ తయారీ కార్యక్రమం జరిగింది. సుమారు రెండు డజన్ల మంది పాకశాస్త్ర నిపుణులు పాల్గొన్న ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా కేంద్రమంత్రి హర్సిమ్రత్ కౌర్ బాదల్తో పాటు ప్రముఖ యోగా గురువు రాందేవ్ బాబా పాల్గొన్నారు. వెయ్యి లీటర్ల సామర్థ్యం, ఏడడుగుల వ్యాసం కలిగి ఉన్న భారీ బాణలిలో ఈ కిచిడీని గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు ప్రతినిధుల నేతృత్వంలోనే తయారు చేశారు. అయితే ఆ రికార్డును ఇంకా ధ్రువీకరించాల్సి ఉంది. కాగా ఈ కిచిడీని సుమారు అరవై వేల మంది అనాథపిల్లలకు అలాగే.. భారత్లోని వివిధ దేశాల దౌత్యకార్యాలయాల సిబ్బందికి కూడా పంపనున్నారు.