హైదరాబాద్, నవంబర్ 04 : హెచ్ఐసీసీలో పట్టణ రవాణ వ్యవస్థపై ప్రారంభమైన అంతర్జాతీయ సమావేశంలో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...సైకిళ్ల వినియోగంపై ప్రచారం అవసరమని, పర్యావరణాన్ని కాపాడటంలో ఇది చాలా ముఖ్యమైనదని తెలిపారు. నగర కాలుష్య నివారణకు ఎలక్ట్రిక్ బస్సులను వినియోగంలోకి తేవాలన్నారు. మెట్రో నగరాల్లో పార్కింగ్ సమస్య పెరుగుతోందని తెలిపారు. ఢిల్లీలో కోటి వాహనాలు ఉన్నాయన్నారు. ఎక్కువ వాహనాలు రోడ్లపైకి రావడం వల్ల ప్రమాదాలు కూడా పెరుగుతున్నాయన్నారు. మూడు రోజులపాటు జరిగే ఈ సమావేశానికి వివిధ ప్రాంతాల నుంచి 1000 మంది ప్రతినిధులు హాజరుకానున్నారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి హరిదీప్సింగ్ పూరి, ఉపముఖ్యమంత్రి మహమూద్ అలీ తదితరులు పాల్గొన్నారు.