ముంబై, నవంబర్ 03 : ముంబైకి చెందిన 19 ఏళ్ల యువతి రోడ్లకు ఇరువైపులా ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాలపై మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్కి ఫిర్యాదు చేసింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. ముంబయికి చెందిన యువతి రోడ్డు మార్గాన నడుచుకుంటూ వెళుతుండగా ఇద్దరు దుండగులు బైక్పై వచ్చి తన ఫోను లాక్కుని పారిపోయారు. దీంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయగా, సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా దొంగను పట్టుకుంటామన్నారు. మూడు నెలలు గడుస్తున్న ఇంకా దొంగ ఆచూకీ తెలీకపోవడంతో ఆమె పోలీసులను అడిగింది. దొంగతనం జరిగిన చోట సీసీ కెమెరాలు ఉన్నా, అందులో దొంగ ముఖం సరిగ్గా కన్పించలేదని, అందుకే పట్టుకోలేకపోయామని పోలీసులు ఆమెకు తెలిపారు. ఫలితం లేక నేరుగా ముఖ్యమంత్రి ఫడణవీస్ కు ట్వీట్ చేసింది. ‘సిగ్నల్ దాటి వెళ్లిపోయేవారి నెంబర్ ప్లేట్ వివరాలను తెలుసుకోవడానికి సీసీటీవీలు సక్రమంగా పనిచేస్తాయి. నేరం జరిగిన ప్రదేశంలో ఏర్పాటు చేసిన సీసీటీవీ ఫుటేజ్లో నిందితులు ముఖాలు కనిపించడం లేదని పోలీసులు చెబుతున్నారు. అంటూ ట్వీట్ చేసింది. దీనిపై ముఖ్యమంత్రి ఎలా స్పందిస్తారో చూడాలి.