న్యూఢిల్లీ, నవంబర్ 03 : మహేంద్ర సింగ్ ధోని.. ఈ పేరు చాలా మందికి సుపరిచితమే. భారత్ క్రికెట్ ను తన కెప్టెన్సీతోనే కాకుండా ఆటగాడిగా ఉన్నత శిఖరాలకు చేర్చిన ఘనత ఈ జార్ఖండ్ డైనమేట్ సొంతం. అలాంటి ధోనిపై ఆస్ట్రేలియా దిగ్గజ ఆటగాడు ఆడమ్ గిల్ క్రిస్ట్ ప్రశంసల వర్షం కురిపించాడు. భారత్ జట్టులో ధోని పాత్ర విలువైనదని, అతను జట్టు నుండి తప్పుకున్న మరుక్షణం భారత్ జట్టులో శూన్యత తప్పదని గిల్లీ వివరించాడు. ఈ సందర్భంగా గిల్ క్రిస్ట్ మాట్లాడుతూ.. "ధోని భారత్ కు బలం. ఆటగాడిగా మూడు నుండి ఏడవ స్థానం వరకు బ్యాటింగ్ చేయగల సత్తా ధోనిలో కలదు. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో కొందరు ధోనిని తక్కువ చేస్తున్నారేమో అనిపిస్తోంది. అలా చేస్తే ఖచ్చితంగా పొరపాటు చేసినట్లే. గత కొంత కాలంగా ధోని ఆట నేను చూడలేదు కానీ బాధ్యత పరంగా ఏ పనినైన పక్కగా అమలుపరచగల శక్తి ధోనికి ఉంది" అంటూ గిల్లీ వ్యాఖ్యానించాడు.