హైదరాబాద్, నవంబర్ 3: ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డి తెలంగాణ పరువు తీశాడని, ఏ గతిలేకే కాంగ్రెస్లో చేరారంటూ బుధవారం తెలంగాణా ఐటి శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. ఈ వ్యాఖ్యలకు ఘాటుగా రేవంత్ రెడ్డి సమాధానమిచ్చారు. ఆయన గురువారం తన ఫేస్ బుక్ వేదికగా.. ఇదిగో కేటీఆర్ దాచిన సత్యం..! అంటూ 2016 జులైలో కేటీఆర్ మలేషియా టూర్కి సంబంధించిన ఫొటోను పోస్ట్ చేశారు. " 2016లో జరిగిన ఓ అధికారిక కార్యక్రమంలో అనధికారికంగా తేజా రాజు సన్ ఆఫ్ సత్యం రామ లింగరాజు, మలేషియన్ ప్రధానితో కలిసి కేటీఆర్ మంతనాలాడారని పేర్కొంటూ కేటీఆర్కు ముందుంది ‘క్రోకడైల్ ఫెస్టివల్’ " అనే శీర్షిక పెట్టారు. ఎవరు స్కాం స్టార్లతో తిరుగుతున్నారో చెప్పడానికి ఇదిగో తిరుగులేని సాక్ష్యం అంటూ పేర్కొన్నారు.