హైదరాబాద్, నవంబర్ 02 : నేడు శాసన మండలిలో జరుగుతున్న చర్చల నేపథ్యంలో కాంగ్రెస్ నేతలు పలు అంశాలపై ప్రశ్నలను లేవనెత్తారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీలు ఆకుల లలిత, షబ్బీర్ అలీ వ్యవసాయం చేయని వారికి కూడా ట్రాక్టర్లు ఇచ్చారని ఆరోపించారు. దీనికి సంబంధించిన జాబితా ప్రభుత్వం బయటపెడితే అనర్హులు తీసుకున్న విషయాన్ని తాము నిరూపించగలుగుతామని వారు సవాల్ చేశారు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన వ్యవసాయ యాంత్రీకరణ పథకం, అర్హులకు కాకుండా అనర్హులకే వరంలా మారిందని కాంగ్రెస్ ఆరోపించడంతో, పార్టీలకతీతంగా అమలు చేయాల్సిన పథకాలు అధికార పార్టీకి అనుకూలంగా కొనసాగిస్తున్నారన్న ఆరోపణల్ని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్రెడ్డి తోసిపుచ్చారు. తాము వ్యవసాయాన్ని ప్రోత్సహించేందుకు రెండున్నర ఎకరాల వ్యవసాయ భూమి ఉన్నవారికి సగం బ్యాంకు రుణం, మిగిలిన సగం ప్రభుత్వ రాయితీతో ట్రాక్టర్లు ఇస్తున్నామని ఆయన వెల్లడించారు. తాము సిఫారసు చేసిన వారేవరికి అధికారులు ట్రాక్టర్లు ఇవ్వడం లేదని వారు ఆవేదన వ్యక్తంచేశారు.