హైదరాబాద్, నవంబర్ 02 : నేరుగా లబ్ధిదారులకు చేరే సంక్షేమ పథకాలకు ఆధార్తో అనుసంధానం చేసినట్టు తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. నేడు శాసనమండలిలో కొందరు నేతలు అడిగిన ప్రశ్నలపై కేటీఆర్ మాట్లాడుతూ.. ఇప్పటికే వంద శాతం ఆధార్ కార్డుల జారీ ప్రక్రియ పూర్తయిందన్నారు. ప్రజాధనం దుర్వినియోగం కాకుండా నిలువరించేందుకే ప్రభుత్వ పథకాలకు ఆధార్ అనుసంధానం చేస్తున్నట్టు ఆయన అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా కేంద్ర ప్రభుత్వ నియామావళిని అనుసరిస్తూనే అవసరమైన నియమ నిబంధనలను రూపకల్పన చేసి సంక్షేమ పథకాలను అర్హులకు మాత్రమే అందేలా అనుసంధానం చేస్తామని మంత్రి కేటీఆర్ వెల్లడించారు.