న్యూఢిల్లీ, నవంబర్ 02 : భారత ప్రధాని నరేంద్ర మోదీని భూటాన్ రాజు జిగ్మే ఖేసర్ నాంగ్యల్ వాంగ్చుక్ దంపతులు బుధవారం కలిశారు. భారత పర్యటనలో భాగంగా మంగళవారం ఢిల్లీ వచ్చిన భూటాన్ రాజు వాంగ్చుక్ దంపతులు నాలుగురోజుల పాటు భారత్లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా మోదీతో సమావేశమైన వాంగ్చుక్.. ఇరు దేశాల మధ్య సత్సంబంధాలు, పలు అంశాలపై చర్చించారు. అంతకుముందు రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, కేంద్ర విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్ను వాంగ్చుక్ దంపతులు కలిశారు. నేడు కేంద్ర రక్షణ మంత్రి నిర్మలాసీతారామన్తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ కాసేపు సరదాగా వారితో ముచ్చటించారు. అనంతరం చిన్నారి యువరాజుకు మోదీ బహుమతులు ఇచ్చారు. ఇటీవల భారత్లో జరిగిన ఫిఫా అండర్-17 వరల్డ్కప్లో ఉపయోగించిన అధికారిక ఫుట్బాల్, ఒక చెస్ సెట్ను ప్రధాని ఆ బుల్లి యువరాజుకు కానుకగా ఇచ్చారు. దీనికి సంబంధించిన ఫొటోలను మోదీ తన ట్విటర్ ఖాతా ద్వారా పంచుకున్నారు.