న్యూఢిల్లీ, నవంబర్ 02 : పార్లమెంట్ లో జరుగుతున్న విచారణ సందర్భంగా పార్లమెంటరీ కమిటీ నివేదిక ప్రస్తావన రావడంతో, రాజ్యాంగ పరమైన సమస్య తలెత్తింది. పార్లమెంటు స్థాయి సంఘం నివేదిక తప్పని పేర్కొంటూ దాఖలయ్యే వాజ్యాలపై.. ఏ విధంగా తీర్పు చెప్పాలని బుధవారం సుప్రీంకోర్టు ప్రశ్నించింది. గర్భాశయ ముఖద్వార కేన్సర్కు సంబంధించిన హ్యూమన్ పాపిలోమా వైరస్ (హెచ్పీవీ) వ్యాక్సిన్ విషయమై కొన్ని మందుల తయారీ సంస్థలను తప్పుపడుతూ పార్లమెంటరీ స్థాయి సంఘం 2012 డిసెంబరు 22న నివేదిక సమర్పించింది. ఈ వ్యాక్సిన్ కారణంగా దుష్పరిణామాలు ఉన్నాయని పేర్కొంటూ కల్పనా మెహతా అనే సామాజిక కార్యకర్త, సామా అనే స్వచ్ఛంద సంస్థలు ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు దాఖలు చేశాయి. విచారణ సందర్భంగా పార్లమెంటరీ కమిటీ నివేదిక ప్రస్తావన రావడంతో, రాజ్యాంగ పరమైన సమస్య తలెత్తింది. దీనిని తేల్చడానికి ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్ర ఆధ్వర్యంలో అయిదుగురు సభ్యులుగల రాజ్యాంగ ధర్మాసనం ఏర్పాటై౦ది. ఓ మందుల కంపెనీ తరఫున హాజరైన సీనియర్ న్యాయవాది హరీష్ సాల్వే వాదనలు వినిపిస్తూ పార్లమెంటరీ కమిటీ తప్పుపట్టినా, దాన్ని సవాలు చేస్తూ ఎవరూ కోర్టును ఆశ్రయించలేరన్నారు. శాసనవ్యవస్థ, న్యాయవ్యవస్థల మధ్య అధికార విభజన ఉన్న నేపథ్యంలో ఎలాంటి నిర్ణయం తీసుకోవాలని ప్రశ్నిస్తూ తీర్పును వాయిదా వేసింది. ఒకవేళ దానిపై కోర్టులో సమీక్షిస్తే అది పార్లమెంటు హక్కుల ఉల్లంఘన కిందికి వస్తుందని తెలిపారు.