న్యూఢిల్లీ, నవంబర్ 02 : భారత్ జట్టు మరో సారి అన్ని విభాగాల్లో చెలరేగింది. గత పది సంవత్సరాలుగా కివీస్ పై టీ-20 ల్లో ఉన్న చెత్త రికార్డును బద్ధలకొట్టడమే కాకుండా, పేసర్ ఆశిస్ నెహ్రాకు ఘనంగా వీడ్కోలు పలికింది. బుధవారం ఫిరోజ్ షా కోట్లా మైదానంలో జరిగిన తొలి మ్యాచ్లో భారత్ 53 పరుగుల తేడాతో న్యూజిలాండ్పై ఘన విజయం సాధించింది. టాస్ ఓడి బ్యాటింగ్ ఎంచుకున్న కోహ్లిసేన మూడు వికెట్ల నష్టానికి 202 పరుగులు చేసింది. భారత్ తరపున శిఖర్ ధావన్(80), రోహిత్ శర్మ(80) పరుగులు చేయగా చివర్లో కోహ్లి(26) పరుగులతో టీమిండియా భారీ స్కోర్ ను సాధించింది. అనంతరం న్యూజిలాండ్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 149 పరుగులు మాత్రమే చేయగలిగింది. సొంతగడ్డపై అంతర్జాతీయ క్రికెట్ కు నెహ్రా గుడ్ బై చెప్పడంతో ఈ మ్యాచ్ విజయం చిరస్మరణీయమని భారత్ కెప్టెన్ కోహ్లి తెలిపాడు. తాజా ఫలితంతో మూడు మ్యాచ్ల సిరీస్లో భారత్ 1–0తో ఆధిక్యంలో నిలిచింది. రెండో టి20 శనివారం రాజ్కోట్లో జరగనుంది.