కోల్కతా, నవంబర్ 01 : ఆకలి అయితే, ఎవరైనా తినాలనుకుంటే తినే పదార్ధాలు అందుబాటులో ఉంటాయి. కానీ మట్టి, మేకులు తింటే వారి పరిస్థితి ఎలా ఉంటుందో తెలిసిందే... ఇంతకీ ఎవరా అనుకుంటున్నారా మేకులు, మట్టి మింగేసేది... ఉత్తర 24 పరగణాల జిల్లాకు చెందిన ఆ వ్యక్తి(48)కి మనోవైకల్యం ఉండటంతో గత కొంతకాలంగా మట్టి, మేకులను మింగేస్తున్నట్లు శస్త్రచికిత్స నిర్వహించిన డాక్టర్ సిద్ధార్థ బిశ్వాస్ తెలిపారు. నెలరోజుల క్రితం నుంచీ అతను కడుపునొప్పితో బాధ పడుతుండటంతో ముందు ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ తీసిన ఎక్స్-రేలో 2 నుంచి 2.5 అంగుళాల మేకులు కనిపించడంతో ఎట్టకేలకు వైద్య కళాశాల ఆసుపత్రికి తరలించి, పొత్తికడుపు వద్ద 10 సెం.మీ.ల మేర కోతపెట్టి అయిస్కాంతాన్ని ఉపయోగించి మేకులను బయటకు తీసినట్లు డాక్టర్ బిశ్వాస్ వివరించారు. శస్త్రచికిత్స చేసి, అతని కడుపులోంచి కేజీకి పైగా బరువున్న 639 మేకులను బయటకు తీశారు. కోల్కతాలోని ప్రభుత్వ వైద్య కళాశాల, ఆసుపత్రి వైద్యులు గంటా 45 నిమిషాల పాటు ఈమేరకు శస్త్రచికిత్స నిర్వహించినట్లు వైద్యులు వెల్లడించారు.