న్యూఢిల్లీ, అక్టోబర్ 31 : రైల్వేలో లెవల్ క్రాసింగ్ ఉండకూడదన్న ముఖ్య ఉద్దేశ్యంతో రైల్వే శాఖ పక్కా ప్రణాళికలు రూపొందిస్తోంది. “ఈ రైళ్లు ఎప్పుడు లేట్” అనే పేరుకు ఇక స్వస్తి చెప్పడానికి ఒక కొత్త టైంటేబుల్ ను విడుదల చేసింది. రేపటి నుండి 700 దూరప్రాంత రైళ్ళ వేగం పెంచాలని ఇండియన్ రైల్వేస్ నిర్ణయించింది. ఈ దూరప్రాంత రైళ్లు దాదాపు 15 నిమిషాల నుండి రెండు గంటల ముందుగానే వాటి గమ్యస్థానాలకు చేరుతాయని, ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించాలని రైల్వే శాఖా మంత్రి పీయూష్ గోయల్ వెల్లడించారు. ముఖ్యంగా రిజర్వేషన్ చేయించుకున్న వారు ఈ విషయాన్ని గమనించి ముందుగానే చేరుకోవాలని తెలిపారు. ఇందులో భోపాల్-జోధ్ పూర్ ఎక్స్ ప్రెస్ 95 నిమిషాల ముందుగానే గమ్య స్థానానికి చేరుకుంటుంది. గౌహతి - ఇండోర్ ఎక్స్ ప్రెస్ 115 నిమిషాల ముందుగా, ఘాజీపూర్ - బాంద్రా టర్మినస్ 95 నిమిషాల ముందుగా గమ్య స్థానానికి చేరనున్నాయి. అంతే కాకుండా అంతగా ఆదరణ లేని స్టేషన్లలో హాల్టింగ్ సౌకర్యాన్ని నిలిపివేశామని రైల్వే శాఖ పేర్కొంది. ఇకపై చాలా రైళ్లన్ని గరిష్టంగా 130కి.మీ. వేగంతో దూసుకుపోతాయని అధికారులు తెలిపారు.