తూ.గో., అక్టోబర్ 30 : తూర్పు గోదావరి జిల్లా ముమ్మిడివరం నియోజక వర్గంలో శివాలయాలు భక్తులతో కిటకిటలాడాయి. కార్తీక మాసం రెండవ సోమవారం సందర్బంగా ముమ్మిడివరం శ్రీ ఉమ సురేశ్వర వారి దేవస్థానం, మురమళ్ళ శ్రీ భద్రకాళీ సమేత వీరేశ్వరస్వామి వారి దేవస్థానం, శ్రీ పార్వతీ కుండలేశ్వర స్వామివారి ఆలయాలు వేద పండితుల మంత్రోచ్ఛారణలతో, భక్తుల శివనామ స్మరణలతో మారుమ్రోగాయి. భక్తులు వేకువజాము నుండి వృద్ద గౌతమి నదిలో పుణ్య స్నానాలు ఆచరించి అత్యంత భక్తిశ్రద్ధలతో శివాలయాలలో స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వివిధ ద్రవ్యాలతో, పళ్లరసాలతో అభిషేకాలు నిర్వహించి స్వామివారిని దర్శించుకుని అనంతరం వేద పండితుల ఆశీర్వచనాలు తీసుకున్నారు. మురమళ్ళ శ్రీ వీరేశ్వర స్వామి వారి దేవస్థానంలో దర్శనానికి వచ్చిన భక్తులకి ఎటువంటి అసౌకర్యం కలగకుండా దేవస్థానం చైర్మన్ జంపన భీమరాజు, ఈవో సత్యనారాయణ ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. భక్తులకి త్రాగునీరు, పిల్లలకు పాలు, ప్రసాద వితరణ ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేశారు.