న్యూఢిల్లీ, అక్టోబర్ 28 : విమాన ప్రయాణికులు విమానాశ్రయ ప్రవేశం కోసం చూపించాల్సిన పత్రాల విధానాన్ని పౌర విమానయాన శాఖ మరింత సులభతరం చేసింది. మొబైల్ ఆధార్ ను గుర్తింపు పత్రంగా కూడా చూపించి, ప్రయాణికులు విమానాశ్రయంలో ప్రవేశించవచ్చని అధికారులు తెలిపిన పౌర విమానన శాఖ ప్రవేశానికి ఇకపై గుర్తింపు కార్డుగా మొబైల్ ఆధార్ ను వినియోగించుకోవచ్చు. ఈ మేరకు విమానయాన భద్రతా విభాగం బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ అండ్ సెక్యూరిటీ (బీసీఏఎస్) తాజాగా విడుదల చేసిన ఉత్తర్వుల్లో పేర్కొంది. దీంతో పాటు తల్లిదండ్రులతో పాటు వెళ్లే మైనర్లకు గుర్తింపు కార్డు చూపడం నుంచి మినహాయింపు ఇచ్చింది. ఎయిర్పోర్టులో ప్రవేశానికి బీసీఏఎస్ ఇటీవల కొన్ని మార్గదర్శకాలను విడుదల చేసింది. పాస్పోర్టు, ఓటర్ ఐడీ, ఆధార్ లేదా ఎం-ఆధార్, పాన్, డ్రైవింగ్ లైసెన్స్ వంటి ఒరిజినల్ గుర్తింపు కార్డును చూపడం ద్వారా విమానాశ్రయంలో ప్రవేశం పొందొచ్చని పేర్కొంది. వీటితో పాటు ఏదైనా జాతీయ బ్యాంక్ జారీ చేసిన పాస్బుక్, పెన్షన్ కార్డు, దివ్యాంగ గుర్తింపు కార్డుతో పాటు, సర్వీస్ ఐడీని కూడా గుర్తింపుగా వినియోగించుకోవచ్చని తెలిపింది. ఎవరైనా ప్రయాణికుల పై గుర్తింపు కార్డుల్లో ఏదైనా సమర్పించలేనప్పుడు గెజిటెడ్ అధికారి సంతకంతో కూడిన ధ్రువీకరణ పత్రాన్ని చూపించినా సరిపోతుందని తాజా మార్గదర్శకాల్లో బీసీఏఎస్ పేర్కొంది.