న్యూఢిల్లీ, అక్టోబర్ 27 : ఇటీవల ధియేటర్లలో దేశభక్తిని, జాతీయ భావాన్ని పెంపొందించడానికి వీలుగా జాతీయ గీతంను వినిపించడం, ఆ సమయంలో ప్రేక్షకులంతా లేచి నిల్చోవడం తప్పనిసరి విషయంపై చాలా రచ్చ కొనసాగుతుంది. తాజాగా సుప్రీ౦ కోర్టు ఈ విషయంపై స్పందిస్తూ.. “జాతీయ గీతం వినిపిస్తున్నప్పుడు ఎవరైనా లేచి నిల్చోకపోతే వారిని దేశభక్తి లేనివారిగా పరిగణించలేమని” తెలిపిన సంగతి తెలిసిందే. ఈ విషయంపై ప్రముఖ క్రికెటర్ గౌతమ్ గంభీర్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా ఓ ఆసక్తికరమై సందేశాన్ని అభిమానులతో పంచుకున్నాడు. “క్లబ్కి వెళ్తే సుమారు 20 నిమిషాల పాటు బయట నిల్చోని ఎదురుచూస్తాం, రెస్టారెంట్కి వెళ్తే 30 నిమిషాల పాటు బయట నిలబడడానికి వెనుకాడం. జాతీయ గీతం వినిపించినప్పుడు మాత్రం 52 సెకండ్ల పాటు నిల్చోలేమా? ఇది కష్టమా” అని ప్రశ్నించాడు. ఈ ట్విట్ ప్రతి ఒక్కరిలో ఆసక్తిని రేకెత్తిస్తోంది.