న్యూఢిల్లీ, అక్టోబర్ 20 : భారత్ లో వైద్యం కోసం ఎదురుచూస్తున్న పాకిస్థానీయులకు విదేశీ వ్యవహారాల శాఖా మంత్రి సుష్మా స్వరాజ్ దీపావళి కానుకను అందించారు. భారత్ లో వైద్యం కోసం వచ్చే వారికి వీసాలు మంజూరు చేయనున్నట్లు తన ట్విట్టర్ ఖాతాలో పేర్కొన్నారు. అమ్నా షమీమ్ అనే పాకిస్థానీ యువతి, ఢిల్లీలో తన తండ్రిని చూసేందుకు అనుమతిని ఇవ్వాల్సిందిగా కోరడంతో మంత్రి సానుకూలంగా స్పందించారు. ఆమెకు వెంటనే వీసాను మంజూరు చేయాలని పాకిస్థాన్ లోని భారత హై కమీషనర్ కు సుష్మా ఆదేశాలు జారీ చేశారు. ఈ క్రమంలోనే దీపావళి పండగను పురస్కరించుకొని అర్హులైన వారందరికీ మెడికల్ వీసాలు జారీ చేయనున్నట్లు ట్విట్టర్ ద్వారా ప్రకటించారు.