న్యూఢిల్లీ, అక్టోబర్ 20 : తమకు అధికారులు ఢిల్లీలో లేరని బాన్సీలాల్ పేట గల్లిలో ఉన్నారని ఐటీ శాఖమంత్రి కేటీఆర్ అన్నారు. సికింద్రాబాద్, సనత్ నగర్ నియోజకవర్గాల్లో పర్యటించిన ఆయన.. రూ.70 కోట్లతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. వర్షాలకు దెబ్బతిన్న రోడ్లను రూ.77 కోట్లతో మరమ్మత్తులు చేస్తామన్నారు. నీరు నిలిచే ప్రాంతాల్లో రూ.130 కోట్లతో ఆ రహాదారులను పూడ్చే పనులకు కేటాయించామన్నారు. అమీర్ పేటలోని కనకదుర్గ ఆలయం వద్ద 9.65 కోట్లతో చేపట్టనున్న రహదారి పనులకు కేటీఆర్ శంకుస్థాపన చేశారు. అనంతరం 3.28 కోట్లతో నిర్మించనున్న 50 పడకల ఆసుపత్రి భవనం, ఎస్ ఆర్ నగర్లోని హౌసింగ్ శాఖ ఆధ్వర్యంలోని కమ్యూనిటీ భవనానికి మంత్రి శంకుస్థాపన చేశారు. మంచినీటి కోసం నగర శివార్లలో 56 పంప్హౌస్ల నిర్మాణం చేపట్టనున్నట్టు మంత్రి వెల్లడించారు. హుస్సేన్సాగర్, మారేడుపల్లి తదితర చోట్ల పంప్ హౌస్ల ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, లక్ష్మారెడ్డి, ఇంద్రకిరణ్ రెడ్డి, కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.