జగిత్యాల, అక్టోబర్ 18 : అత్తింటి వేధి౦పులు తట్టుకోలేక ఓ యువతి ఆత్మహత్య చేసుకుంది. రాయికల్ మండలంలోని అల్లీపూర్ గ్రామంలో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం ..... అల్లీపూర్ గ్రామానికి చెందిన నాగరాజుకు మూడు సంవత్సరాల క్రితం మల్లాపూర్ మండలంలోని వి.వి.రావుపేటకు చెందిన ఆరె లచ్చన్న, రాధల కుమార్తె రచనను ఇచ్చి వివాహం చేశారు. వివాహ సమయంలో రూ. 10 లక్షల వరకట్నంతో పాటు 4 తులాల బంగారు ఆభరణాలు అందించారు. పెళ్లి అయిన ఆరు నెలల తరువాత అత్తి౦టి వారు అదనపు కట్నం కోసం వేధింపులు చేయడం మొదలు పెట్టారు. సంవత్సరం క్రితం రచనకు కొడుకు పుట్టడంతో, పురుడు సమయంలో కూడా రూ. 60 వేలు ఇస్తేనే పుట్టింటికి వెళ్ళాలని డిమాండ్ చేశారని, తరచూ ఆమె భర్త నాగరాజు, అత్త గంగు వేధించేవారని తెలిపారు. మూడు నెలల క్రితం నాగరాజు గల్ఫ్ కి వెళ్ళగా, ఆమె మాత్రం పుట్టింటిలో ఉండిపోయింది. వారం రోజుల క్రితం ఆమె అత్తవారింటికి రాగ, మంగళవారం పురుగుమందు తాగి అపస్మారక స్థితికి చేరుకోగా, కుటుంబ సభ్యులు ఆస్పత్రికి చేర్చే క్రమంలో పరిస్థితి విషమించి మరణించింది. అదనపు కట్నం కోసం అత్తింటి వారు పెట్టె వేధి౦పులు తట్టుకోలేక చనిపోయిందని మృతురాలి తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.