అమరావతి, అక్టోబర్ 17 : అమరావతిలో కొత్త రాజధాని నిర్మాణ౦లో భాగంగా సచివాలయం, శాసనసభ, హైకోర్టు భవనాల నిర్మాణ ఆకృతుల కొరకు అక్టోబర్ 10న సీఆర్ డీఏ బృందం లండన్ వెళ్లిన విషయం తెలిసిందే. ఈ నేపధ్యంలో పురపాలక మంత్రి పి. నారాయణ మాట్లాడుతూ.... భవనాల నిర్మాణ ఆకృతులను లండన్ లోని నార్మల్ ఫోస్టర్ అండ్ పార్ట్ నర్స్ సంస్థ రూపొందిస్తుంది. సచివాలయంలో ఆయా విభాగాల మంత్రులు, కార్యదర్శులు, ఉద్యోగులందరూ ఒక్క చోటే ఉండేట్లు 20 అంతస్తుల సచివాలయ భవనం, విభాగాదిపతుల కార్యాలయ భవనాలు వేరుగా ఉండేటట్లు రూపొందించారని తెలిపారు. శాసనసభ, హైకోర్టు భవనాలకు ఒక్కో దానికి నాలుగు ఆకృతులను సిద్ధం చేయగా శాసనసభా భవనం మొదట వజ్రా కృతిలో ఉన్నా, అది అంత ఆకర్షణీయంగా లేనందునా మరో ఆకృతిని సిద్ధం చేస్తున్నారని తెలిపారు. శాసనసభా, హైకోర్టు భవనాలకు ఇంకా తుది రూపం రావడానికి వారం రోజుల సమయం పడుతుందని మంత్రి వెల్లడించారు. రాజమౌళి భవనాలను పరిశీలించి పోస్టర్ సంస్థ వారికి కొన్ని సూచనలిచ్చారు. శాసనసభ భవనం దూరం నుంచి అయిన కనపడే విధంగా 50 మీటర్లు ఎత్తు ఉండేటట్లు రూపొందిస్తున్నారని వ్యక్తపరచారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విదేశీ పర్యటనలో భాగంగా అక్టోబర్ 24 లండన్ కు వెళ్ళే సమయానికి ఈ ఆకృతులు సిద్దంగా ఉండనున్నట్లు సమాచారం.