వరంగల్, అక్టోబర్ 16: తెలంగాణ ప్రభుత్వం సంకల్పించిన కాకతీయ జౌళి పార్కు కు రూ. 2000 కోట్ల పెట్టుబడులు రానున్నాయి. ఈ జౌళి పార్కు వరంగల్ గ్రామీణ జిల్లా చింతలపల్లి-శాయంపేటల మధ్య ఏర్పాటు కానుంది. ఈ నెల 22న, తొలిదశలో 1200 ఎకరాల్లో శంకుస్థాపనను ఘనంగా నిర్వహించాలని ప్రభుత్వం బావిస్తోంది. ఇందుకోసం పరిశ్రమలు, చేనేత, జౌళి శాఖల ఉన్నతాధికారులు మహారాష్ట్ర, గుజరాత్, తమిళనాడు రాష్ట్రాలతోపాటు.. ముంబయి, భివాండి, సూరత్ తదితర ప్రాంతాలకు వెళ్లి అక్కడి పారిశ్రామికవేత్తలతో చర్చించారు. ఈ నేపధ్యంలో 8 ప్రముఖ సంస్థలు పెట్టుబడులకు సంసిద్ధత తెలుపగా, రాష్ట్రానికి చెందిన మూడు సంస్థలు తాము అక్కడ పరిశ్రమలు నిర్మిస్తామని ప్రభుత్వానికి వెల్లడించాయి. వీటితో పాటు.. జౌళి రంగంలో పేరొందిన విదేశీ సంస్థ ఒకటి 300 ఎకరాల్లో రూ.1000 కోట్లతో పరిశ్రమలను స్థాపిస్తామంటూ రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసింది. ఈ సంస్థలన్నీ ఈ నెల 22న జరిగే శంకుస్థాపన కార్యక్రమంలో ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలో అవగాహన ఒప్పందాలు చేసుకుంటాయి.