పెందుర్తి, అక్టోబర్ 14 : జీవితాంతం తనకు తోడు ఉంటానని ప్రమాణం చేసిన భర్తే, భార్యను హతమార్చిన ఘటన పెందుర్తిలో చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం... పెందుర్తి యాతపేటకు చెందిన మహాలక్ష్మి నాయుడు, రాజేశ్వరి తమ పిల్లలతో కలిసి పెందుర్తి పాత ఊరిలోని రామాలయం వీధిలో నివాసముంటున్నారు. మహాలక్ష్మి నాయుడు పినగాడి లోని ఓ వెల్ఫేర్ కళాశాలలో సెక్యూరిటీగార్డ్ గా పని చేస్తు౦డగా రాజేశ్వరి గాజువాక బ్యూటీపార్లర్లో పనిచేస్తోంది. గత కొద్ది రోజులుగా వీరిద్దరూ ఒకరి మీద ఒకరు అనుమానంతో గొడవలు పడుతున్నారు. శుక్రవారం జరిగిన గొడవలో మాటామాట పెరగడంతో భర్త క్రికెట్ బ్యాట్ తీసుకొని ఆమె తల మీద కొట్టడంతో స్పృహ కోల్పోయిన ఆమె అక్కడికక్కడే మరణించింది. ఈ ఘటనపై పెందుర్తి సీఐ జె. మురళి, రాజేశ్వరి భర్తను అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా వీరికి ఒక కుమార్తె, కుమారుడు ఉన్నారు.