హైదరాబాద్, అక్టోబర్ 11 : కొత్త జిల్లాలు ఏర్పాటు చేసి ఏడాది పూర్తైన సందర్భంగా సిద్ధిపేట జిల్లాలో ప్రభుత్వ కార్యాలయాలు, భవనాలకు ముఖ్యమంత్రి కేసీఆర్ శంకుస్థాపన చేశారు. హైదరాబాద్ నుంచి రోడ్డు మార్గాన ద్వారా సిద్ధిపేటకు చేరుకున్న సీఎం దుద్దెడ నాగుల పంట వద్ద సమీకృత కార్యాలయాల సముదాయం పోలీస్ కమిషనరేట్ సిద్ధిపేట వైద్య కళాశాల భవన నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడిన ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక రాష్ట్ర పోరాటం జిల్లాల ఏర్పాటు పరిణామక్రమాన్ని ప్రజల ముందు ఉంచారు. సిద్ధిపేట రాజకీయంగా జన్మనిచ్చిందని పేర్కొన్న కేసీఆర్ ఈ ప్రాంతంతో తనకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ప్రత్యేక రాష్ట్రం ఆవిర్భవించిన తరువాత అభివృద్ధిలో తెలంగాణ దేశంలోనే అగ్రగామిగా దుసుకేలుతుందని సీఎం స్పష్టం చేశారు. అన్ని వర్గాల సంక్షేమమే లక్ష్యంగా పింఛన్లు సహా అనేక పథకాలు అమలు చేస్తున్నట్లు కేసీఆర్ గుర్తుచేస్తున్నారు. పోలీసు, న్యాయ విద్యుత్ అధికారుల చిత్తశుద్దితో అత్యుత్తమ ఫలితాలు వస్తున్నాయని ప్రశంసించారు. కేసీఆర్ కిట్టు సహా ప్రభుత్వ పన్ను తీరుతో సర్కారీ దవాఖానాలో ప్రసవాల సంఖ్య 2,3 రెట్లు పెరిగాయని వివరించారు. రైతులను సంఘటితం చేయడంలో భాగంగా వచ్చే ఏడాది నుంచి ఎకరానికి రూ. 8 వేలు సాయం అందిస్తామని పునరుద్ఘాటించారు. సిద్ధిపేట సర్వతోముఖాభివృద్ధికి అన్ని విధాలుగా సహాయం చేస్తామని ప్రకటించిన కేసీఆర్ ఈ జిల్లాకు అదనంగా మరో వెయ్యి రెండు పడక గదులు మంజూరు చేశారు.