శ్రీశైలం, అక్టోబర్ 12 : నిండు కుండలా మారిన శ్రీశైలం ప్రాజెక్టుకు వరద ప్రవాహం ఇంకా కొనసాగుతుండటంతో, రెండు గేట్లను రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఎత్తివేశారు. ఇందుకోసం ఆయన ప్రాజెక్టు వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి ఒక్కో గేటును 10 అడుగుల మేర ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం శ్రీశైలం జలాశయ నీటిమట్టం 884.80 అడుగులతో 214.8450 టీఎంసీలుగా ఉండగా, ఎగువ పరివాహక ప్రాంతాల నుంచి 1,39,007 క్యూసెక్కుల నీరు ప్రాజెక్టులోకి వచ్చి చేరుతోంది. కాగా... శ్రీశైలం పరిసర ప్రాంతాల్లో భారీగా కురుస్తున్న వర్షాల కారణంగా ప్రాజెక్టులోకి వరదలు వస్తున్నాయి. దీంతో ప్రాజెక్టు నిండిపోవడంతో 2గేట్లను ఎత్తాల్సి వచ్చింది. ఈ కార్యక్రమంలో శ్రీశైలం ఎమ్మెల్యే రాజశేఖర్రెడ్డి, అచ్చంపేట ఎమ్మెల్యే బాలరాజు పాల్గొన్నారు.